ముంబై : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సుంకాల పెంపు ఘాటు భారత్ కు తాకింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం పెట్రోల్ ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ పెట్రోల్, డీజిల్ పై రూ.2లు ఎక్సైజ్ డ్యూటీని విధించినట్లు పేర్కొంది. ఈ నిర్ణయం మేరకు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. సాధారణంగా పెట్రోల్, డీజిల్ అమ్మకం ధరలను నిర్ణయించే అధికారాన్ని కేంద్రం ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న నాలుగు పెట్రో కంపెనీలకే కట్టబెట్టింది. దీంతో ఆయా కంపెనీలు అంతర్జాతీయ ముడిధరల ఆధారంగా ప్రతిరోజూ పెట్రోల్ ధరలు తగ్గించడమో లేక పెంచడమో చేస్తూ వస్తున్నాయి. అయితే ఆ కంపెనీలతో ఎటువంటి సంబంధం లేకుండా కేంద్రం ఎక్సైజ్ అస్త్రాన్ని బయటకు తీసి వినియోగదారులపై రూ.2లు వడ్డించింది.
ధరలలోమార్పుు ఉండదు… కేంద్రం
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పెట్రోల్ ధరలు పెరుగుతాయని వాహనదారులు భావించారు. అయితే ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంపు భారం సామాన్యులపై ఉండబోదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎక్సైజ్ సుంకం పెంపును ఆయిల్ కంపెనీలే భరిస్తాయని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సామాన్యులకు పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ట్విట్టర్(ఎక్స్) వేదికగా క్లారిటీ ఇచ్చింది. మరోవైపు అమెరికా -చైనా ట్రేడ్ వార్, ఆర్థిక మాంద్యం భయాలు, ఒపెక్ ప్లస్ ఉత్పత్తి పెంపు వంటి అంతర్జాతీయ ఆర్థిక భయాల నేపథ్యంలో కొంతకాలంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. వారం వ్యవధిలోనే సుమారు 10 డాలర్ల వరకు తగ్గి.. ఇప్పుడు మూడేళ్ల కనిష్ట సాయికి చేరింది. అయినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి తగ్గింపు జరగలేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గింపు నేపథ్యంలో ఇప్పటికైనా పెట్రోల్ ధరలు తగ్గుతాయేమోనని ఎదురుచూస్తున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పెంపు పేరుతో షాకిచ్చింది.