హైదరాబాద్ – ఆంధ్ర్రప్రభ – అప్పు చేసి, పప్పు కూడు అనేది నాటి సామెత.. అప్పు చేసి, చిప్ప కూడు అనేది నేటి కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాడు అప్పు చేసి 70 లక్షల అన్నదాతలకు అండగా నిలిచి వారికి రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు ఖాతాల్లోకి వేశాం. రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసి.. రూ.6 వేల కోట్లతో రైతుబీమా చేసి.. లక్ష 11 వేల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందేలా చేసి.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు.. పారిశ్రామిక, గృహావసరాలకు 24 కరెంటు అందించి.. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, సీతారామసాగర్ కట్టి 45 వేల చెరువులు కుంటలు బాగుచేసి.. 45 లక్షల మందికి పైగా ఆసరా ఫించన్లతో అండగా నిలిచి.. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కళ్యాణలక్ష్మి, వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, 30 మెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటుచేస్తే అప్పులు తప్పని రాద్దాంతం చేశారని విమర్శించారని కెటిఆర్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
15 నెలల పాలనలో రూ.1.65 లక్షల కోట్లు అప్పు చేసి.. రుణమాఫీ ఎగ్గొట్టి.. రైతుబంధు ఎగ్గొట్టి.. రైతుబీమా లేకుండా చేసి.. కరెంటుకు కోతలు వేసి. గురుకులాలను గాలికి వదిలేసి, కాళేశ్వరాన్ని ఎండబెట్టి.. పాలమూరు రంగారెడ్డిని పడావుపెట్డి.. శ్రీశైలం సొరంగం కుప్పకూల్చి 8 మంది ప్రాణాలు బలితీసుకున్న బాధ్యతలేని ప్రభుత్వం ఇది అని కాంగ్రెస్పై కేటీఆర్ మండిపడ్డారు. తట్టెడు మట్టి తీసింది లేదు.. ఒక్క పథకం అమలు చేసింది లేదు.. గల్లీలో గాలిమాటలు, ఢిల్లీకి ధనం మూటలు మోసుడు తప్ప.. 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి అని నిలదీశారు. నాడు అప్పులు తప్పని అడ్డగోలు అభాండాలు.. నేడు అందినకాడికి అప్పులు అని విమర్శించారు.