Talasani | సీఎం హుందాగా వ్య‌వ‌హ‌రించాలి…

Talasani | సీఎం హుందాగా వ్య‌వ‌హ‌రించాలి…

Talasani | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) తన బాష మార్చుకోవాలని, స్థాయికి తగినట్లు హుందాగా వ్యవహరించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) హితవు పలికారు. శనివారం సికింద్రాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయంలో 19మంది లబ్ధిదారులకు షాదీముబారక్ (15), కళ్యాణ లక్ష్మీ (4) ఆర్ధిక సహాయం చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ…. ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ (Kalyana Lakshmi, Shaadi Mubarak) లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని రెండేళ్లు అవుతున్నా నేటి వరకు ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదని, ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మహిళలకు ప్రతినెలా అందిస్తామన్న 2500 రూపాయలు ఏమయ్యాయ‌ని, వికలాంగులకు 3వేల నుండి 6 వేలకు పెంచుతామన్న పెన్షన్ ఎప్పుడు ఇస్తారని అన్నారు. ఇందిరమ్మ ఇల్లులు (Indiramma’s house) ఎప్పుడు నిర్మిస్తారని పేదలు అడుగుతున్నారని వీటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తొండలు వదులుతా.. పేగులు వేసుకుంటా అంటూ ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం విచారకరం అన్నారు. బూతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న గౌరవాన్ని దిగజార్చుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా బాష మార్చుకోవాలని, మంచి పనులు చేసి ప్రజల మన్ననలను పొందారని సూచించారు.

ఇష్టానుసారంగా డీ లిమిటేషన్…


డీ లిమిటేషన్ (Delimitation) పేరుతో ప్రభుత్వం, అధికారులు ఇష్టానుసారంగా డివిజన్ లను ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. కమిషనర్ కు పిర్యాదు చేసినా, కౌన్సిల్ సమావేశాలలో అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోలేదని విమర్శించారు. హడావుడి గా డివిజన్ లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఎవరికి అర్ధం కావడం లేదన్నారు. తాము అధికారంలో ఉన్నాం… మా ఇష్టమొచ్చినట్లు చేస్తాం అన్నట్లుగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శించారు.

సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ మోండా డివిజన్ పరిధిలో ఉంటే మోండా డివిజన్ ను తీసుకెళ్ళి మల్కాజ్ గిరిలో కలపడం ఏంటని ప్రశ్నించారు. మీ విధానాలు మార్చుకోకపోతే ప్రజలు బండకేసి కొడతారని ధ్వజమెత్తారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ లు టి.మహేశ్వరి, దీపికా, తహసీల్దార్ పాండు నాయక్, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, శ్రీహరి, ఆంజనేయులు, ప్రేమ్, శేఖర్, ఆరీఫ్, అబ్బాస్, నాగభూషణం తదితరులు ఉన్నారు.

Leave a Reply