వెలగపూడి – ఏపీలో ఈరోజు నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా, రాష్ట్రంలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేడు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష . ఇవాళ్టి ఎగ్జామ్ కోసం సెట్-2 ప్రశ్నపత్రం ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 17 వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. ఇక, ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఇక, తొలి రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ద్వితీయ భాషపై పరీక్ష జరగనుంది. కాగా, ఇంట ర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థులకు ఒక రోజు తప్పించి మరో రోజు పరీక్షలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టులు పెట్టారు. “ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు! పిల్లలందరూ ధైర్యంగా ఉండాలి. ఏకాగ్రతతో పరీక్షలు రాయండి. మీ వంతు కృషి చేయండి. మీపై నమ్మకం ఉంచండి” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
“పరీక్షలకు హాజరవుతున్న ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు! మీరు శ్రద్ధగా చదవండి. కానీ ఒత్తిడికి గురికాకండి. ఆత్మవిశ్వాసం, మీరు పరీక్షలకు సిద్ధమయ్యే విధానం మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాయి. వేసవి కాలం కావడంతో డీహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విజయం గురించి ఆలోచించకుండా ఉత్తమంగా ప్రయత్నించండి. ప్రయత్నం సరిగ్గా చేస్తే తప్పకుండా విజయం లభిస్తుంది” అని లోకేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.