Black Friday | ఒక్క రోజులో రూ.10 ల‌క్ష‌ల కోట్ల సంప‌ద ఆవిరి…

ముంబ‌యి – దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక్క రోజులోనే మదుపర్లు సంపద రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధిస్తున్న టారిఫ్‌లు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ మదుపర్లలో నెగిటివ్ సెంటిమెంట్‌కు కారణమవుతున్నాయి. దీంతో శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత మరింత కిందకు దిగజరాయి. సెన్సెక్స్ 73, 500 దిగువకు, నిఫ్టీ 22, 200 కిందకు పడిపోయాయి.


గురువారం ముగింపు (74, 612)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం 400 పాయింట్ల నష్టంతో రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతగా నష్టాల్లోకి కూరుకుపోయింది. ఏ దశలోనూ లాభాల్లోకి రాలేదు. మధ్యాహ్నం తర్వాత నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. చివరకు సెన్సెక్స్ 1414 పాయింట్ల భారీ నష్టంతో 73, 198 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. ఏకంగా 420 పాయింట్ల భారీ నష్టంతో 22, 124 వద్ద స్థిరపడింది. అన్ని ఇండెక్స్‌లు భారీ నష్టాలను చవిచూశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *