Tirumala | నేడు తిరుమలలో అపురూప ఘట్టం…
తిరుమల- తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లక్ష్మీ కాసుల హారాన్ని నేడు ఊరేగించనున్నారు టీటీడీ అధికారులు. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రాత్రి గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల శ్రీవారి లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకెళతారు. కల్యాణ వెంకటేశ్వర స్వామివారికి అలంకరిస్తారు. అలాగే- తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఈ ఉదయం శ్రీ ఆండాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు ప్రారంభమవుతుంది. నగర వీధుల్లో ఊరేగింపుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంటాయి.
ఇక శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయంలో ప్రత్యేక పుష్ప, విద్యుత్ దీపాలంకరణలు పూర్తి చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, పోలీస్ విభాగాల సమన్వయంతో ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్ తో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.