PRESIDENT| తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరహస్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

ఆలయంలో ధ్వజ స్థంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్, ఈవో శ్రీవారి చిత్ర పటాన్ని తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను రాష్ట్రపతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకి దేవి, భాను ప్రకాష్ రెడ్డి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.

