Cyber Crime | బెంగళూరు మహిళ డిజిటల్ అరెస్ట్..

Cyber Crime | బెంగళూరు మహిళ డిజిటల్ అరెస్ట్..
- రూ.32 కోట్లకు టోకరా
- 6 నెలలు వీడియో కాల్లో బందీ
- సీబీఐ అధికారులుగా నటించిన మోసగాళ్లు
బెంగళూరు: డిజిటల్ అరెస్ట్ మోసంలో నగరంలోని ఇందిరానగర్లో నివసించే 57 ఏళ్ల మహిళ, ఒక ఎంఎన్సీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాదాపు రూ. 32 కోట్లు (రూ.31.83 కోట్లు) కోల్పోయింది. ఈ మోసం 6 నెలల పాటు సాగింది, దీనిలో మోసగాళ్లు సీబీఐ అధికారులుగా, డీహెచ్ఎల్ సిబ్బందిగా నటించారు.
స్కైప్ వీడియో కాల్ ద్వారా ఆమెను నిరంతరం పర్యవేక్షించారు, 187 బ్యాంక్ లావాదేవీల ద్వారా డబ్బును బలవంతంగా తీసుకున్నారు. కుమార్తె వివాహమైన తర్వాత మోసం గురించి ఆమె ఆలస్యంగా బైటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. సెప్టెంబర్ 15, 2024న డీహెచ్ఎల్ అంధేరీ (ముంబై) ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది.
ఆమె పేరుతో పంపిన పార్సెల్లో క్రెడిట్ కార్డులు, పాస్పోర్టులు, సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పారు. ఆమె ఐడెంటిటీ మిస్యూస్ అయిందని, సైబర్ క్రైమ్ (cyber crime) కావొచ్చని హెచ్చరించారు. ఆ తర్వాత కాల్ సీబీఐ అధికారి మోహిత్ హండాకు ట్రాన్స్ఫర్ అయింది. అన్ని ఆధారాలు మీవే అని బెదిరించారు.

పోలీసులకు చెప్పకూడదని, క్రిమినల్స్ ఆమె ఇంటిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. డిజిటల్ అరెస్ట్లో రెండు స్కైప్ ఐడీలు ఇన్స్టాల్ చేయించి, 24/7 వీడియో సర్వెయిలెన్స్లో ఉంచారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఆమెను వేధించారు. 187 ఆర్థిక లావాదేవీల్లో మొత్తం రూ.31.83 కోట్లు వారి ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.
డిసెంబర్ 6న కుమార్తె ఎంగేజ్మెంట్కు ముందు ఫేక్ క్లియరెన్స్ లెటర్ పంపారు. ఫిబ్రవరి, 2025 వరకు రీఫండ్ వాగ్దానాలు చేశారు. మార్చి 26, 2025న మోసగాళ్లు అదృశ్యమయ్యారు. ఆమె షాక్లో ఉండిపోయారు. జూన్లో కుమార్తె వివాహం అయిన తర్వాత నవంబర్ 14న కంప్లేంట్ ఫైల్ చేశారు. మానసిక, శారీరక ఒత్తిడి వల్ల ఒక నెల అసుపత్రిలో చికిత్స తీసుకోవలసి వచ్చింది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది కర్ణాటకలో అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ మోసంగా నిలిచింది.
