గూడెం పంచాయతీని ఏజెన్సీ నుంచి తొలగించి ఎన్నికలు జరపాలి

గూడెం పంచాయతీని ఏజెన్సీ నుంచి తొలగించి ఎన్నికలు జరపాలి
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం గూడెం గ్రామపంచాయతీని ఏజెన్సీ నుంచి తొలగించి ఎన్నికలు జరిపించాలని ప్రజలు కోరారు. గురువారం గూడెం గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో తహసీల్దార్ రోహిత్ దేశ్పాండేకు వినతి పత్రం అందజేశారు. 35 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేక గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని వివరించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నందున మళ్లీ గ్రామపంచాయతీ ఎన్నికలు నిలుపుదల చేయడంతో ఎన్నికలు జరిగే అవకాశం లేనందున, అధికారులు సర్వే చేసి వన్ ఆఫ్ సెవెంటీని తొలగించాలని కోరారు.
గ్రామంలో ఒక్క గిరిజనుడు కూడా లేనందున గ్రామపంచాయతీని ఏజెన్సీ నుంచి తొలగించాలని వివరించారు. ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో గూడెం గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగేలా చూడాలని ప్రజలు కోరారు. అదేవిధంగా గూడెంలో కొందరు రాత్రికి రాత్రే దేవస్థానం చుట్టు ఉన్న గుట్టలను తవ్వుకుంటు అక్రమంగా మొరం అమ్ముకుంటున్నారని, వాటిని అధికారులు అడ్డుకొని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు మాజీ ఎంపీటీసీ తోట మోహన్ పాల్గొన్నారు.
