జపాన్లో వచ్చే ఏడాది (2026) జరగనున్న 20వ ఆసియా క్రీడల్లో క్రికెట్ ను చేర్చేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇటీవలే 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ లో చోటు దక్కించుకున్న క్రికెట్.. ఇప్పుడు జపాన్లో జరగనున్న 2026 ఆసియా క్రీడల్లోనూ స్థానం సంపాదించింది.
ఈ మేరకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా, ఐచి-నగోయా క్రీడల నిర్వాహక కమిటీ మధ్య జరిగిన సమావేశంలో.. క్రికెట్ ను ఆసియా క్రీడల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
క్రికెట్ను తొలిసారిగా 2010లో ఆసియా క్రీడల్లో ఆడించారు. ఆ తర్వాతి ఎడిషన్లో(2014)నూ కొనసాగగా.. 2018లో నిలిపివేశారు. అయితే, 2022లో చైనాలో జరిగిన ఎడిషన్లో క్రికెట్ను తిరిగి ప్రారంభించారు. ఈసారి, జపాన్లో జరగనున్న 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్ను చేర్చడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ !
కాగా, ఐచి-నగోయాలో జరగనున్న పోటీల్లో క్రికెట్ T20I ఫార్మాట్లో నిర్వహించనున్నారు. మోత్తం 14 పురుషుల జట్లు, 9 మహిళల జట్టు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. గత ఆసియా క్రీడల్లో టీమిండియా పురుషులు, మహిళల విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించగా.. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.
గత ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత పురుషుల జట్టు అత్యధిక సీడింగ్ (పాయింట్లు) ఆధారంగా గోల్డ్ మెడల్ గెల్చుకోగా.. హర్మన్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ఫైనల్లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో విజయం సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది.
క్రికెట్ తో పాటు ఎంఎంఏ..
ఇదిలాఉంటే, 2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగనుండగా… ఈ ఆసియా గేమ్స్ లో క్రికెట్ తో పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) అప్రూవ్ పొందింది. కాగా, ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కురాష్, జుజిట్సులతో పాటు కంబాట్ స్పోర్ట్స్ కింద ఆరు ఈవెంట్లతో అరంగేట్రం చేయనుంది.