- జాతరను మరింత గొప్పగా నిర్వహిస్తామన్న మంత్రి సీతక్క
హైదరాబాద్ : మేడారం (Medaram) సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళాగా పిలిచే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు మేడారంలో శాశ్వత నిర్మాణాలు (Permanent structures), రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ (Tribal Welfare Department) నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన నిధుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ లకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క (Seethakka) కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ… “ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆదివాసీల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం రూ. 150 కోట్లు మంజూరు చేయడం, ఆదివాసీ గిరిజనుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా ప్రభుత్వం చిత్తశుద్దికి నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకం(Historical) గా జరుగనుంది” అని పేర్కొన్నారు.