ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) లో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (State Government) అప్రమత్తమైంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం (Heavy rain) నమోదవుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. జగిత్యాల మినహా 15 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయని ఆయన చెప్పారు.

ప్రత్యేకంగా నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో శనివారం ఉదయం సీఎం ఉన్నతాధికారుల (superiors) తో సమీక్ష నిర్వహించారు.

వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో SDRF, NDRF బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు (Assistive measures) చేపడతారని సీఎం వెల్లడించారు. వాగులు, వంకలు పొంగిపొర్లే పరిస్థితుల్లో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే రక్షణ శిబిరాలకు తరలించాలని ఆదేశించారు.

నీటి పారుద‌ల శాఖ అధికారులు, సిబ్బంది రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు, కుంట‌ల నీటి మ‌ట్టాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ నీటి విడుద‌ల‌పై ముందుగానే క‌లెక్ట‌ర్లు (Collectors), క్షేత్ర స్థాయి సిబ్బందికి స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవ‌ల్ బ్రిడ్జీలు, కాజ్‌వేల‌పై నుంచి రాక‌పోక‌లు పూర్తిగా నిషేధించాల‌ని, పోలీసులు, రెవెన్యూ అధికారులు (Police, revenue officials) వాటి స‌మీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌న్నారు. వ‌ర్ష‌పు నీరు నిల్వ ఉండి దోమ‌లు, ఇత‌ర క్రిమికీట‌కాలు విజృంభించి అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర‌, పుర‌పాల‌క‌, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

రెవెన్యూ, విద్యుత్‌, పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య‌, పుర‌పాల‌క‌, పోలీస్‌, అగ్నిమాప‌క శాఖ‌లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌మ‌న్వ‌యంతో సాగాల‌ని సీఎం సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.

Leave a Reply