బెంగళూరు : ఎయిరిండియా ఫ్లైట్లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరు (Bangalore) లో ఫ్లైట్ టేకాఫ్కు కొన్ని నిమిషాల ముందు కాక్పిట్లో పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే వైద్యపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనపై ఎయిరిండియా (Air India) ఒక ప్రకటన విడుదల చేసింది.
తమ పైలట్లలో ఒకరికి ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి తలెత్తడంతో బెంగళూరు నుంచి ఢిల్లీ (Delhi)కి వెళ్లాల్సిన ఏఐ 2414 విమానాన్ని నడపలేకపోయారని పేర్కొంది. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం పైలట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. పైలట్ (Pilot) వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా నిలవడమే తమ తక్షణ కర్తవ్యమని ఎయిరిండియా వెల్లడించింది. ఈ సంఘటన కారణంగా బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్ను కొంతసేపు నిలిపివేశారు. మరో పైలట్ వచ్చిన తర్వాత ఫ్లైట్ బయలుదేరిందని ఎయిరిండియా తెలిపింది.