ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి ప్రవేశిస్తున్న వరద నీటి ప్రవాహం (ఇన్ ఫ్లో) 1,15,000 క్యూసెక్కులకు చేరింది. వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమై 14 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
కాగా, స్పిల్వే ద్వారా 95,566 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 29,494 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. భీమా లిఫ్ట్-I – 650, కొయిలసాగర్ లిఫ్ట్ – 315, ఎడమ కాల్వ (LMC) – 550, కుడి కాల్వ (RMC) – 290, పారలల్ కెనాల్ (భీమా లిఫ్ట్-II) – ద్వారా 750 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇతర డిమాండ్లను కలుపుకుని మొత్తం 1,27,659 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్తోంది.
జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు (9.657 టీఎంసీలు సామర్థ్యం) కాగా, ప్రస్తుతం నీటిమట్టం317.680 మీటర్ల వద్ద ఉంది. మొత్తం నీటి నిల్వ 7.991 టీఎంసీలుగా ఉండగా, అందులో లైవ్ స్టోరేజ్ 4.284 టీఎంసీలుగా ఉంది.
ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు పర్యవేక్షణను కఠినంగా కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు దిగువన నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.