తెహ్రాన్ – ఇజ్రాయెల్తో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మూసివేసిన తమ గగనతలాన్ని అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం తిరిగి తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దేశంలోని మధ్య, పశ్చిమ ప్రాంతాల మీదుగా విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ఆ దేశ రోడ్లు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్తో 12 రోజుల పాటు సాగిన వైమానిక ఘర్షణల అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది.
మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అఖవాన్ ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత, సంబంధిత అధికారులు భద్రతాపరమైన అంశాలను పూర్తిగా సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. ఇప్పటికే దేశ తూర్పు ప్రాంతంలోని గగనతలాన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాల కోసం తెరిచినట్లు గుర్తుచేశారు.