భారత ఖగోళ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. ఈ సాయంత్రం, క్రూ డ్రాగన్ క్యాప్సూల్ “గ్రేస్” అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో స్పేస్ఎక్స్ – నాసా సంయుక్తంగా చేపట్టిన అక్షియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా భారత వ్యోమగామి, ఉత్తరప్రదేశ్కి చెందిన శుభాంషు శుక్లా విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ని చేరుకున్నారు.
దీంతో, శుభాంషు శుక్లా రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి ప్రవేశించిన రెండవ భారతీయుడిగా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు.
ఈ మిషన్ భారత కాలమానం ప్రకారం నిన్న (జూన్ 25న) తెల్లవారుజామున 12:01కి ప్రారంభమైంది. శుభాంషు శుక్లాతో పాటు ఈ ప్రయాణంలో మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ (అమెరికా), స్వావోష్ ఉజ్నాన్స్కీ (పోలాండ్), టిబోర్ కాపు (హంగేరీ) భాగస్వాములయ్యారు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రారంభమైన ఈ ప్రయాణం దాదాపు 28 గంటల గగనయానం అనంతరం విజయవంతమైంది.
ఈ మిషన్లో శాస్త్రీయ ప్రయోజనాలూ కీలకంగా ఉన్నాయి. రాబోయే 14 నుండి 21 రోజులలో సుమారు 60కు పైగా శాస్త్రీయ ప్రయోగాలు జరగనున్న ఈ మిషన్లో, శుభాంషు భారత శాస్త్రవేత్తల తరఫున ఏడు కీలక ప్రయోగాల్లో పాల్గొంటారు. సూక్ష్మ శైవలాలపై గురుత్వాకర్షణ లేనప్పుడు కలిగే ప్రభావం, మానవ కండరాల నిర్వీర్యత, సూక్ష్మజీవుల ప్రవర్తన, మానసిక నెవ్రోకాగ్నిటివ్ పనితీరులో మార్పులు వంటి అంశాలపై అధ్యయనం చేయనున్నారు.