- వారాహిని అవతారంలో కనకదుర్గమ్మ…
- ఇంద్రకీలాద్రిపై ఘనంగా వారాహిని నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…
- తొమ్మిది రోజులపాటు గుప్తా నవ రాత్రుల పూజలు…
- సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి ముస్తాబు…
- అమ్మకు పవిత్ర ఆషాడ సారె….
- తొలి ఆషాడ సారె సమర్పించిన ఈవో దంపతులు…
- జగన్మాత దర్శనానికి తరలివస్తున్న భక్తులు…
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : సస్యశ్యామల రూపినీ వారాహిని శరణు, శరణు, పాహిమాం పాహిమాం అంటూ భక్తులు జగన్మాతను కొలుస్తున్నారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ కనకదుర్గమ్మ (Kanakadurgamma) వారాహిని భక్తులకు అనుగ్రహిస్తుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర వారాహి నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రి (Indrakeeladri) పై అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జూన్ 26వ తేదీ నుండి జులై 4వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే గుప్త నవరాత్రులు అట్టహాసంగా గురువారం నుండి ప్రారంభమయ్యాయి. వారాహి ఉత్సవాల (Varahi Festival) సందర్భంగా ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గుప్త నవరాత్రి ప్రారంభ పూజల్లో భాగంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి వీకే శినా నాయక్ దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. యాగశాలలో మొదటిరోజు ఉదయం విఘ్నేశ్వర పూజ రిత్విక్ వరుణ పుణ్యావాచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఎల్ దుర్గాప్రసాద్ ఉప ప్రధానార్చకులు కోటా ప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు విశేష పూజలను శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు.
తొలి ఆషాడ సారె సమర్పణ…
ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ వారి నీ ఇంటి ఆడపడుచు గా భావించి ఆషాడ మాసం సందర్భంగా భక్తులందరూ ఆషాడసారె సమర్పించడం ఆనత ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర ఆషాడ మాస ప్రారంభం సందర్భంగా గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రధాన ఆలయం నుండి మహా మండపం ఆరవ అంతస్తులకి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఏటా ఆనవాయితీగా మొదటి ఆషాడ సారెను దేవస్థానం సిబ్బంది తరపున ఆలయ కార్యనిర్వాహణాధికారి వీకే శినా నాయక్ (Sheena Nayak) దంపతులు, దేవస్థానం సిబ్బంది కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారికి పరమ పవిత్రమైన సారెను సమర్పించారు.
ప్రధాన ఆలయం నుండి సారే సంబరాలతో మహా మండపం చేరి అమ్మవారికి నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. తొలి ఆషాడ సారే అమ్మవారికి అందించే కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులతో పాటు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రంగారావు ,అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ బి వెంకటరెడ్డి, ఎన్ రమేష్ బాబు, ఎం తిరుమలరావు, శ్రీనివాస్, కే గంగాధర్ రావుతో పాటు ఆలయ సిబ్బంది అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారాహిని అవతారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకోవడంతో పాటు అమ్మవారికి పవిత్ర సారే సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి కి క్యూ కట్టారు. అమ్మవారి దర్శనానంతరం భక్తులకు అర్చకులు ఉచిత ప్రసాదాన్ని పంపిణీ చేయడంతో పాటు సామూహిక ఆశీర్వచనాన్ని కూడా అందజేశారు.

ఆషాడ సారె సమర్పించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత….
శ్రీ కనకదుర్గమ్మ వారికి గురువారం రాష్ట్ర హోంశాఖ మంత్రి వి.అనిత (Vangalapudi Anitha) పవిత్ర ఆషాడ సారెను సమర్పించారు. ఇంద్రకీలాద్రి కి అమ్మవారి దర్శనానికి వచ్చిన మంత్రి అనితకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి అనిత మహా మండపం ఆరవంతస్తులు అమ్మవారికి పవిత్ర సాధన సమర్పించి అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులను అందుకున్నారు.