కర్నూల్ బ్యూరో, జూన్ 25 (ఆంధ్రప్రభ) : సిపిఆర్, ప్రథమ చికిత్సపై జిల్లా పోలీసులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ (SP Vikrant Patil) ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ముందుండే జిల్లా పోలీసు సిబ్బందికి సిపిఆర్ (CPR), ప్రథమ చికిత్స పై అవగాహన కల్పించారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదో తెలియజేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ… గుండెపోటు వచ్చినప్పుడు, స్పృహ తప్పి కోల్పోయినప్పుడు, హాస్పిటల్ కు తీసుకువెళ్ళే 1గంటలోపు చేసే సీపీఆర్ విధానంపై జిల్లా పోలీసులకు శిక్షణ, అవగాహన కల్పించడంతో పాటు పోలీసులచే ప్రాక్టీస్ చేయిస్తున్నామన్నారు.
మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ యాదవ్ (Sunil Yadav) మాట్లాడుతూ… ప్రతి ఇంట్లో సిపిఆర్ పై అవగాహన ఉండడం ముఖ్యమన్నారు. ఏ సమయంలో నైనా ఉపయోగపడవచ్చన్నారు. ప్రతి కుటుంబ సభ్యులకు తెలియజేయాలన్నారు.ఈ శిక్షణా కార్యక్రమంలో బాగా ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. రూ. 8వేల విలువ గల హెల్త్ చెకప్ మెడికల్ కూపన్స్ (Health Checkup Medical Coupons) పోలీసులకు ఉచితంగా అందజేశారు. పోలీసుల కుటుంబ సభ్యులకు రూ.8వేల విలువ గల హెల్త్ చెకప్ మెడికల్ కూపన్స్ ను రూ.1000లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ యాదవ్, పోలీసు వేల్పేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, డిఎస్పీలు బాబు ప్రసాద్, భాస్కర్ రావు, ప్రసాద్, సిఐలు తేజమూర్తి, మన్సురుద్దీన్, అబ్దుల్ గౌస్, నాగరాజా రావు, రామానాయుడు ఆర్ఐలు నారాయణ, జావేద్, సోమశేఖర్ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.