హైదరాబాద్: హైదరాబాద్లోని జీడిమెట్ల (Jedimetla) లో దారుణం చోటుచేసుకున్నది. పదో తరగతిలోనే ప్రేమ ఎంటని మందలించిన తల్లిని ప్రియునితో కలిసి చంపేసింది (Murder). ఎన్ఎల్బీ నగర్కు చెందిన సట్ల అంజలి (39), తేజశ్రీ తల్లీ కూతుళ్లు. తేజశ్రీ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నది. పగిల్ల శివ (19) అనే యువకుడిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నది. విషయం తెలుసుకున్న తల్లి అంజలి.. పదో తరగతిలోనే ప్రేమ ఏంటని తేజశ్రీ (Tejasree) ని మందలించింది. బుద్ధిగా చదువుకోవాలని సూచించింది. దీంతో వారం రోజుల క్రితం శివతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చిన తేజశ్రీ.. తల్లి అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు శివతో కలిసి ప్లాన్ చేసింది. దీంతో సోమవారం సాయంత్రం తన తమ్ముడు పగిల్ల యశ్వంత్ (19) (Yashwant) తో కలిసి జీడిమెట్ల వచ్చిన శివ.. తేజశ్రీ ఇంటికి వెళ్లారు.
అంజలి ఇంట్లో పూజచేసుకుంటుండగా ఆమెపై వెనుక నుంచి దాడిచేసిన శివ.. బెడ్షీట్లో ఆమె ముఖాన్ని కప్పేశాడు. అనంతరం తేజశ్రీ తన తల్లి తలపై సుత్తితో కొట్టడంతో స్పృహ కోల్పోయింది. దీంతో శివ తమ్ముడు యశ్వంత్ ఆమె పీకను కత్తితో కోయడంతో అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు అంజలి.. తెలంగాణ వీరణారి చాకలి ఐలమ్మ మునిమనవరాలు కావడం గమనార్హం.