వేములవాడలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి
మెదక్ జిల్లాలో ఇద్దరు మృతి
మహారాష్ట్రలో 9 మంది మృతి
దుర్గంచెరువు బ్రిడ్జి వద్ద ఒకరి ఆత్మహత్య
సెంట్రల్ డెస్క్, హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా (siricilla) వేములవాడలో కారు బీభత్సం సృష్టించింది. వేర్వేరు చోట్ల ముగ్గురిని ఢీకొంది. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గాయపడ్డారు. రుద్రవరం వద్ద బైకును (bike ) ఢీకొట్టిన కారు( car).. ఆగకుండా అలానే వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దత్తయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు.
అనంతరం వేములవాడ మండలం ఆరేపల్లి వద్ద మరో బైక్ అదే కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం కారును అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. కారు నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మెదక్-బోధన్ జాతీయ రహదారిలో ఇద్దరి మృతి
మెదక్ – బోధన్ జాతీయ రహదారిలో ఎల్లారెడ్డి మండలంలోని మల్లాయిపల్లి గ్రామ శివారులో పోచారం కాలువ పై (pocharam canal ) నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి గుంతలో ప్రమాదవశాత్తు కారు బోల్తా (car overturned) పడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నర్సింగ్ రావు పల్లి తండాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు లూనావత్ పీర్యా (38), మరో వ్యక్తి కేతావత్ పీర్యా (32) లు అక్కడికక్కడే మృతి చెందగా, లూనావత్ వేణు (25), లూనా వత్ సోను (14), లూనావత్ చిన్నా (12) అనే ముగ్గురికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉందన్నారు.
పెద్దగుట్టకు వెళుతుండగా…
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కారులో మెదక్ జిల్లా (medak District) పాపన్నపేట మండలంలోని నర్సింగరావు పల్లి తాండ నుండి నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పెద్దగుట్ట కు మొక్కులు తీర్చుకునేందుకు వెళుతున్నారు.
ఈ క్రమంలో ఎల్లారెడ్డి మండలంలోని మల్లాయి పల్లి గ్రామ సమీపంలో పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువపై జాతీయ రహదారి రోడ్డు వెడల్పు పనులలో బాగా ప్రధాన కాలువపై బ్రిడ్జిని నిర్మాణం చేపడుతున్నారు. ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో, రాత్రి వేళలో వెళ్తున్న కారుకు సరైన దారి కనిపించకపోవడంతో, బ్రిడ్జి నిర్మాణం కోసం వేసిన మట్టి రోడ్డుపై నుంచి పోచారం ప్రధాన కాలువలోకి కారు దూసుకు వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం 108 వాహనాలలో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు, మృతదేహాలను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మహారాష్ట్రలో తొమ్మిది మంది దుర్మరణం
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జెజురి-మోర్గావ్ రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. స్విఫ్ట్ డిజైర్ కారు పికప్ టెంపోను ఢీకొట్టడంతో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జెజురి నుండి ఇందాపూర్ వైపు వేగంగా వెళుతున్న స్విఫ్ట్ డిజైర్ కారు, శ్రీరామ్ ధాబా వద్ద రోడ్డు పక్కన నిలిచిన పికప్ టెంపోను ఢీకొట్టింది. ఈ సమయంలో ధాబా యజమాని సోమనాథ్ రామచంద్ర వైస్, ఇతరులు టెంపో నుండి రిఫ్రిజిరేటర్ను దించుతున్నారు. మరణించిన వారిలో ఒక మహిళ, ఒక మైనర్ కూడా ఉన్నారు. అలాగే గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ, ఒక పురుషుడు ఉన్నారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగించారు. భారీ వర్షం కారణంగా వేగంగా వచ్చిన కారు అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య
దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ అడ్డగుట్టలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న సుష్మ (27) మాదాపూర్ లోని ఓ కార్యాలయంలో ఉద్యోగం చేస్తుంది. రోజులాగే బుధవారం కూడా ఉద్యోగం కోసం వచ్చిన సుష్మ రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి అంజయ్య ఆమె పనిచేస్తున్న ఆఫీస్ మేనేజర్ కు కాల్ చేశాడు. అయితే రాత్రి 10:30 గంటలకే సుష్మ కార్యాలయం నుండి బయలుదేరి వెళ్లినట్లు మేనేజర్ తెలిపాడు. సుష్మ స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా కూతురు ఆచూకీ దొరకకపోవడంతో తెల్లవారుజామున నాలుగు గంటలకు సుష్మ తండ్రి అంజయ్య మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దుర్గం చెరువులో మహిళ మృతదేహం తేలుతుందని ఉదయం 7 గంటలకు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెలికితీశారు. ఆ మృతదేహం సుష్మ గా గుర్తించారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించిన మాదాపూర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.