హైదరాబాద్: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు . ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు.
ఈ నెల 5న గుండెపోటు తో ఏఐజీ ఆస్పత్రి లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
మాగంటి రాజకీయ ప్రస్థానం..మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్గా పని చేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.
మాగంటి గోపినాథ్ 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నారు. 2023లో కూడా ఎన్నికల్లో గెలిచారు.మాగంటి గోపీనాథ్ తల్లిదండ్రులు.. కృష్ణమూర్తి, మహానంద కుమారి, జీవిత భాగస్వామి సునీత, సంతానం.. మాగంటి వాత్యల్యనాధ్ (కుమారుడు), అక్షర నాగ, దిశిర (కుమార్తెలు).
మాగంటి నిర్మాతగా తీసిన సినిమాలు.. పాతబస్తీ (1995), రవన్న (2000), భద్రాద్రి రాముడు (2004), నా స్టైలే వేరు (2009).