భద్రాచలం: ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ నేతలతో పాటు వందల సంఖ్యలో దళ సభ్యులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు గత ఐదు రోజుల నుంచి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ లోకల్ పోలీసులు, సాయుధ దళం 7వ బెటాలియన్తో సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
తాజా సమాచారం మేరకు ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు అగ్ర కమాండర్లు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అదేవిధంగా ఘటనా స్థలంలో ఇద్దరి మృతదేహాలతో పాటు ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, మూడు రోజుల వ్యవధిలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ పార్టీ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.