సూర్యాపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన తాజా రాజకీయ పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసే కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై పరోక్షంగా ఖండించారు. బీజేపీలో విలీనం కాదుకదా, కనీసం పొత్తు కూడా ఉండదన్నారు. బీఆర్ఎస్లో అధినాయకుడు కేసీఆర్ మాత్రమే అన్నారు. ఆంధ్రా మహానాడులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలుగుదేశం మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకని ప్రశ్నించారు. 2004తోనే తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిందన్నారు.
బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం..
హైదరాబాద్ అభివృద్ధి ఆయన వల్లనే జరిగిందనడం హాస్యాస్పదమన్నారు. 2004లో సమైఖ్య ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.26 వేల లోపు కాగా, 2014 నుంచి ఆంధ్రలో ఐదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని గుర్తు చేశారు. అన్నిరంగాలు అభివృద్ధిలో దూసుకుపోయాయన్నారు. ప్రత్యేక రాష్టంగా ఏర్పడ్డ నాడు తెలంగాణాలో రూ.1.12 లక్షల తలసరి ఆదాయముంటే.. కేసీఆర్ పాలనలో రూ.3.70 లక్షలకు వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.2.50 లక్షలు మాత్రమేనన్నారు. చంద్రబాబు పరిపాలన గొప్పదే అయితే ఏపీ ఆదాయం ఎందుకు పెరుగుతలేదని ప్రశ్నించారు.