డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన

లోకేశ్‌ రాజీనామాకు కాకాణి డిమాండ్‌

మనుబోలు, ఆంధ్రప్రభ: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజితమ్మ ఆధ్వర్యంలో వీరభద్రస్వామి దేవస్థానం నుంచి జాతీయ రహదారి వద్ద ఉన్న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ సాగింది. మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. యువత, డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ర్యాలీకి పోలీసులు అనుమతులు, భద్రతా కారణాలను చూపుతూ పలు చోట్ల అడ్డంకులు కల్పించారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. ర్యాలీ ప్రారంభంలోనే పోలీసులు భారీగా మోహరించడంతో పార్టీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ర్యాలీని కొనసాగించాల్సిందేనని పట్టుబట్టిన కాకాణి పూజితమ్మ పార్టీ శ్రేణులతో కలిసి నడిరోడ్డుపై బైఠాయించారు.

ర్యాలీని నియంత్రించేందుకు పోలీసులు రోడ్డుకు ఇరువైపులా తాళ్లు కట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. కొంతదూరం వెళ్లిన అనంతరం రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపి, మళ్లీ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉండగా నెల్లూరు నగరంలో మరో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి మనుబోలు ర్యాలీ ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. రూరల్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసుల ఆంక్షలను అధిగమిస్తూ ర్యాలీ ముందుకు సాగింది.

వీరభద్రస్వామి దేవస్థానం నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. మార్గమధ్యంలో బ్యానర్లు చించివేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. పలు చోట్ల పోలీసులు అడ్డుకున్నప్పటికీ ర్యాలీని కొనసాగించి చివరకు నిర్ణయించిన ప్రాంతానికి చేరుకున్నామని పార్టీ నేతలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సభలో కాకాణి పూజితమ్మ, కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రసంగించారు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంలో కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ అవకతవకలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ పోరాటాలు కొనసాగిస్తోందని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు రోజుల రిలే నిరాహార దీక్షల అనంతరం మనుబోలులో భారీ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. పోలీసుల ఆంక్షలు, ఇతర అడ్డంకులు ఎదురైనా డీఎస్సీ అభ్యర్థుల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని కాకాణి ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం విద్యా ప్రమాణాలు పడిపోయాయని విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనపై కూటమి నాయకులు తమ మాట తీరును మార్చుకోవాలని సూచించారు. డీఎస్సీ విషయంలో మోసపోయామని భావిస్తున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదనలో ఉన్నారని తెలిపారు.

ప్రతిపక్షాల నిరసనలను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. బ్యానర్లు చించివేయడం, ర్యాలీని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం దారుణమని విమర్శించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.