అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
కార్మికులు, రైతుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి
అచ్చంపేట ఆంధ్రప్రభ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా విధానాలను అమలు చేస్తోందని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్. దేశ్యానాయక్ ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
సోమవారం అచ్చంపేట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలతో సభ నిర్వహించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ చేపట్టి అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్. దేశ్యానాయక్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. శంకర్నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడారు.
కార్మికులు, రైతులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని వారు విమర్శించారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాస్వామ్యవాదులు ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి, గతంలో అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలి
వర్షాభావ పరిస్థితులు, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా వీబీజీ–రామ్జీ చట్టాన్ని తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. రైతులకు రుణవిమోచన చట్టం, పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం, పంట బీమా సౌకర్యాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు
రాస్తారోకో సందర్భంగా పోలీసులు ప్రజా ఉద్యమ నాయకులను అరెస్టు చేయడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి బి. రాములు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సైదులు, శ్రావణ్కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చింతల నాగరాజు, సీఐటీయూ నాయకులు ఎస్. వెంకటయ్య, పర్వతాలు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు పద్మ, లక్ష్మి, జ్యోతి, రాధ, అలివేలు, గ్రేస్అమ్మ, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలస్వామి, సుల్తాన్, కొండయ్య, నిరంజన్, ఈశ్వరయ్య, గణేష్, శ్రీను, తులసీరామ్, ఇసాక్, సిద్ధిరాజు, మున్సిపల్ కార్మికులు బాలమ్మ, లక్ష్మణ్, అలివేలు తదితరులు పాల్గొన్నారు. జైల్భరో కార్యక్రమానికి సీపీఎం నాయకులు ఎండీ బాబర్, కృష్ణయ్య, మల్లేష్, బాల్రాజ్, శ్రీరామ్ తదితరులు మద్దతు తెలిపారు.
