డ‌బ్ల్యూటీసీ 2027 ఫైన‌ల్ కు ప్లేస్ ఫిక్స్ !

ఆంధ్రప్రభ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2027 ఫైనల్‌కు వేదికను అధికారికంగా ప్రకటించింది. 2027 జూన్ 9 నుంచి 13 వరకు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక ఫైనల్‌కు లండన్‌లోని ది ఓవల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదే మైదానంలో 2023 WTC ఫైనల్ కూడా జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి తొలి WTC టైటిల్‌ను కైవసం చేసుకుంది.

టెస్టు క్రికెట్‌కు 150 ఏళ్ల వేడుకల్లో ప్రత్యేక ఫైనల్…

2027 సంవత్సరం టెస్టు క్రికెట్ చరిత్రలో మైలురాయిగా నిలవనుంది. టెస్టు క్రికెట్ ప్రారంభమై 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరగనున్న WTC ఫైనల్‌కు మరింత ప్రత్యేకత ఏర్పడింది. ఐసీసీ జనరల్ మేనేజర్ (ఈవెంట్స్ & ఆపరేషన్స్) గౌరవ్ సక్సేనా మాట్లాడుతూ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌గా మారిందన్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ది ఓవల్‌కు ప్రత్యేక స్థానం ఉందని, అభిమానులకు చిరస్మరణీయ అనుభవాన్ని అందించేందుకు ECBతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ECB మేనేజింగ్ డైరెక్టర్ నీల్ స్నోబాల్ మాట్లాడుతూ, 2023లో ది ఓవల్‌లో జరిగిన ఫైనల్‌కు అభిమానులు, ప్రసార సంస్థల నుంచి అద్భుత స్పందన లభించిందని, 2027 ఫైనల్ మరింత గొప్పగా నిర్వహిస్తామని చెప్పారు.

పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానం…

ప్రస్తుతం కొనసాగుతున్న 2025-27 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో పోటీ ఆసక్తికరంగా సాగుతోంది. 87.50 శాతం పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా (75%) రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ (72.22%) మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌పై 2-0తో సిరీస్ గెలిచిన బంగ్లాదేశ్ (58.33%) కూడా బలమైన పోటీదారుగా మారింది.

అయితే, రెండు సార్లు ఫైనల్ ఆడిన భారత్ 48.15 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక ఆరో స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన సిరీస్‌ల్లో తప్పక విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఉంది.

రాబోయే సిరీస్‌లతో రేసు మరింత ఉత్కంఠ..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సైకిల్‌లో ఫైనల్ రేసు ఉత్కంఠభరితంగా మారుతోంది. జూలై, ఆగస్టు నెలల్లో జరిగే కీలక టెస్టు సిరీస్‌లు పాయింట్ల పట్టికను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశముంది. ఈ సిరీస్‌ల ఫలితాలు ఫైనల్‌కు అర్హత సాధించే రెండు జట్ల నిర్ణయంలో కీలకంగా మారనున్నాయి.

కీలక టెస్టు సిరీస్‌లు
జూలై 25 నుంచి – వెస్టిండీస్ × పాకిస్థాన్ (2 టెస్టులు)
ఆగస్టు 13 నుంచి – ఆస్ట్రేలియా × బంగ్లాదేశ్ (2 టెస్టులు)
ఆగస్టు 15 నుంచి – శ్రీలంక × భారత్ (2 టెస్టులు)
ఆగస్టు చివరి వారంలో – ఇంగ్లాండ్ × పాకిస్థాన్ (3 టెస్టులు)

ఈ నాలుగు సిరీస్‌ల్లో ప్రతి మ్యాచ్ కూడా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల ప్రదర్శనపై ఫైనల్ రేసు దిశ ఆధారపడే అవకాశముందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.