ఓటు హక్కు వజ్రాయుధం…

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఓటు హక్కు ప్రతి పౌరుడి జన్మహక్కు అని, అది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం లాంటిదని ఆదిలాబాద్ ఆర్టీఏ సభ్యుడు దూట రాజేశ్వర్ అన్నారు.

శనివారం ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటరు సవరణ ఇంటింటి సర్వే కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ సర్వే ఫారాలను సక్రమంగా నింపి సంబంధిత బీఎల్‌వోలకు అందజేయాలని సూచించారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఎస్‌ఐఆర్ సర్వేలో పాల్గొని పూర్తి సమాచారాన్ని అందించాలని కోరారు.

ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావాలంటే ఈ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివరాల నమోదులో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కాంగ్రెస్ నాయకులు తమ తమ పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఓటర్లకు సర్వే ప్రాముఖ్యతను వివరించి, అర్హులందరూ ఓటు హక్కు పొందేలా అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అరకిల్ల పరమేశ్వర్, యువకులు సాజిద్, బిట్టు, బీఎల్‌వో, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.