గద్వాల : గద్వాల జిల్లాలో గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటిక్యాల మండలంలోని 44వ జాతీయ రహదారిపై ప్రియదర్శి హోటల్ వద్ద కారు అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి నంద్యాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ధర్మారెడ్డి అనే వ్యక్తి కుటుంబీకులతో కలిసి ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు నంద్యాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. ఆరుగురిలో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం కాకనూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు పుల్లారెడ్డి, లక్ష్మిసుబ్బమ్మ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108 అంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా నలుగురు పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం.