నిధులు మంజూరు చేయాలి..

నిధులు మంజూరు చేయాలి..

  • ఎంపీ ఈటల రాజేందర్‌కు బీజేపీ నాయకుల వినతి

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మేడ్చల్ డివిజన్ గిర్మాపూర్ పట్టణంలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతిపత్రం సమర్పించారు.

గిర్మాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ప్రస్తుత అంగన్‌వాడీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని నాయకులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వర్షాకాలంలో పైకప్పు నుంచి వర్షపు నీరు భవనంలోకి చేరుతుండటంతో చిన్నారులు, అంగన్‌వాడీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

భవనం పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోననే ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొందని పేర్కొన్నారు. చిన్నారుల భద్రత, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎంపీ నిధుల నుంచి ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేసి నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ బీజేపీ అధ్యక్షుడు కొండం ఆంజనేయులు ముదిరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు వంగేటి హనుమంత్ రెడ్డి, చీర్ల సత్యనారాయణ, డివిజన్ బీజేపీ కార్యదర్శులు బండి విష్ణు గౌడ్, బొక్క సురేందర్ రెడ్డి, బూత్ అధ్యక్షుడు బండి బాబు గౌడ్, జిల్లా బీజేవైఎం కార్యదర్శి రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.