Telangana Congress Leak Row | నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌పై రాహుల్​ సీరియస్​​

Telangana Congress Leak Row | నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌పై రాహుల్​ సీరియస్​​

తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పుపైనా ఊహాగానాలు
మధ్యప్రదేశ్​ బీజేపీకి లీకు చేసింది ఎవరు?
తెలంగాణలోని కీల‌క నేతలే లీకువీరులా
విచార‌ణ‌కు ప్రత్యేక కమిటీ వేసిన హైకమాండ్
ప్రాథ‌మిక అంశాల‌ను గుర్తించిన అధిష్టానం
క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యంపై రాహుల్ ఆగ్ర‌హం
అంత‌ర్గ‌త శ‌త్రువుల‌ను క్షిమించ‌రాద‌ని నిర్ణ‌యం
రాష్ట్ర మంత్రివ‌ర్గంలోనూ క‌ద‌లిక‌ల‌కు అవ‌కాశం
స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ఉండ‌బోతుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న లీకుల రాజకీయం పరాకాష్టకు చేరింది. ఏఐసీసీ వేదికగా జరిగిన ఒక అనూహ్య పరిణామం.. చివరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సారథి, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కుర్చీకే ఎసరు పెట్టే స్థాయికి చేరడం పొలిటికల్ సర్కిల్స్‌లో పెను సంచలనంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా ఎంపిక చేసి బరిలోకి దించిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక.. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలే వెన్నుపోటుకు పాల్పడ్డారనే పక్కా ఆధారాలు ఢిల్లీ పెద్దలకు చిక్కాయి. ఈ తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంపై రాహుల్ గాంధీ అత్యంత ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జిగా ప‌నిచేసిన కీల‌క నేత, గాంధేయ‌వాది మీనాక్షి నటరాజన్ అంటే రాహుల్ గాంధీ కోటరీలో అత్యంత నమ్మకమైన, విలువలతో కూడిన రాజకీయాలు చేసే సీనియర్ నాయకురాలిగా పేరుంది. ఆమె నామినేషన్‌ను తిరస్కరించడానికి బేస్‌గా మారిన తెలంగాణ పాత ప్రైవేట్ కంప్లైంట్ వివరాలను.. ఇక్కడి కాంగ్రెస్ నేతలే స్వయంగా బీజేపీకి లీక్ చేశారనే అంశంపై ఏఐసీసీ ఇప్పటికే ఒక ప్రత్యేక విచారణ కమిటీని రంగంలోకి దించింది. పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాల వల్లనే పార్టీ జాతీయ స్థాయిలో ఇంతటి అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని రాహుల్ గాంధీకి ప్రాథమికంగానే ఒక స్పష్టత వచ్చేసింది. తన సొంత ఎంపికపైనే దెబ్బకొట్టిన ఈ అంతర్గత శత్రువులను క్షమించే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారం కేవలం ఒక రాజ్యసభ సీటును కోల్పోవడం కాదు, రాహుల్ గాంధీ నాయకత్వానికే విసిరిన సవాల్‌గా ఢిల్లీ పెద్దలు చూస్తున్నారు. అందుకే, బాధ్యులపై చర్యలతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌ను రూట్ లెవెల్ నుండి ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయిన‌ట్టు ఢిల్లీ నుంచి స‌మాచారం.

పీసీసీ చీఫ్‌ బాధ్యత తీసుకోవాల్సి ఉందా?

ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ రాష్ట్ర అథారిటీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పాత్రపై తీవ్రమైన స్కృటినీ నడుస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కూడా రాష్ట్రంలో పార్టీ అంతర్గత సమాచారాన్ని, రహస్యాలను కాపాడటంలో, సొంత నేతలను కంట్రోల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే బలమైన అభిప్రాయానికి హైకమాండ్ వచ్చిన‌ట్టు స‌మాచారం. ఫలితంగా, తెలంగాణలో పార్టీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మహేష్ కుమార్ గౌడ్‌ను పక్కన పెట్టి.. గ్రూపులను అణచగల ఒక అత్యంత సీనియర్, పవర్‌ఫుల్ లీడర్‌ను టీపీసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంద‌ని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఏఐసీసీ బ్యాక్‌ఎండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు సమాచారం.

మంత్రివర్గం సహా మొత్తం ప్రక్షాళన..

ఈ ప్రక్షాళన ప్రభావం కేవలం పార్టీ కమిటీలకే పరిమితం కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్‌పై కూడా తీవ్రంగా పడబోతున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, డిప్యూటీ సీఎం మధ్య సాగుతున్న భీకరమైన వర్గపోరు.. ఈ లీకేజీ వ్యవహారానికి ప్రధాన కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జిల్లాల్లోని కొందరు మంత్రుల వెనుక ఉన్న ఒక బడా బిజినెస్ లాబీ.. కాంగ్రెస్‌లో ఉంటూనే సమాచారాన్ని బీజేపీకి చేరవేసే డబుల్ గేమ్ ఆడుతోందని, మీనాక్షి నటరాజన్ ఇష్యూలో కూడా ఆ వ్యాపారవేత్తల హస్తం స్పష్టంగా ఉందని నిఘా నివేదికలు చెప్తున్నాయి. దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన హెవీ వెయిట్ మంత్రుల పోర్ట్‌ఫోలియోలను మార్చడం లేదా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయం అన్న అభిప్రాయాలను పార్టీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు

మరోవైపు, ఈ సంక్షోభాన్ని ఒక సామాజిక సమీకరణాల మార్పుకు కూడా వేదికగా వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. చాలా కాలంగా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల నుంచి వస్తున్న మంత్రివర్గ ప్రాతినిధ్య డిమాండ్‌ను నెరవేర్చడానికి.. ఈ లీకుల వ్యవహారంలో దొరికిపోయిన నాన్-పెర్ఫార్మర్ల మంత్రులను కేబినెట్ నుండి తప్పించనున్న‌ట్టు స‌మాచారం. అట్లా ఖాళీ అయ్యే స్థానాల్లో బీసీ నేతలకు, సీనియర్లకు చాన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ సర్జికల్ స్ట్రైక్ సమయంలో ప్రభుత్వం ఇబ్బంది పడకుండా ఉండేందుకు పార్టీని శాసించగల కొందరు అత్యంత పవర్‌ఫుల్ మంత్రులను ప్రస్తుతానికి టచ్ చేయకుండా.. కేవలం ‘వాచ్ లిస్ట్’ లో ఉంచి, తగిన సమయంలో వారి సంగతి తేల్చాలని ఏఐసీసీ భావిస్తోంది. మొత్తానికి, మధ్యప్రదేశ్‌లో తిరస్కరణకు గురైన మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఎపిసోడ్, ఊహించని విధంగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక పెను రాజకీయ భూకంపానికి దారితీసింద‌నేది ఇక్క‌డి రాజ‌కీయ ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి.