సడక్‌గూడలో దాహార్తికి ఊరట

సడక్‌గూడలో దాహార్తికి ఊరట

జైనూర్ ఆంధ్రప్రభ: జంగం గ్రామపంచాయతీ పరిధిలోని సడక్‌గూడలో తలెత్తిన తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ప్రారంభించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని సడక్‌గూడలో వేసవి ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో తాగునీటి కొరత ఏర్పడింది. సమస్యను గుర్తించిన జంగం గ్రామ సర్పంచ్ పెందూర్ అనుసయా అర్జున్, ఉప సర్పంచ్ సయ్యద్ సజ్జద్ అలీ ఆధ్వర్యంలో శనివారం ట్యాంకర్ ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టి నీటి ఎద్దడిని నివారించేందుకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు.

తాగునీటి సమస్యకు వెంటనే స్పందించి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply