సమస్యల పరిష్కారానికై నిరవధిక సమ్మె

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ఐకెపి (సెర్ప్) పరిధిలో పని చేస్తున్న వీఓఏలు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ..వీఓఏ జాక్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో పాల్గొని కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని హస కొత్తూరు క్రాస్ రోడ్డు వద్ద ధర్నా సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 302/2022 మరియు జీఓ 363/2025 ప్రకారం అమలు చేయాల్సిన పలు అంశాలు ఇంకా అమలు చేయలేదని,ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ముఖ్యంగా వీఓఏ లకు తగిన వేతనాలు,పదోన్నతులు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

నెలకు రూ.20 వేల వేతనం అమలు చేయాలని,తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్‌ పాలసీ అమలు చేసి,అర్హులైన వీఓఏలను సీసీ లుగా పదోన్నతి కల్పించాలని,రూ.20 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని,వీఓఏ లకు ట్యాబ్ సౌకర్యం కల్పించాలని,జీఓ 58ను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు,ధర్నాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విఓఏ లు కే.లక్ష్మీ,వనజ,మధురిమ,రుచిత,రమ్య, ప్రేమల,రోజా,సువర్ణ,రమాదేవి,వాణి, లత,అనూష,భాగ్యలక్ష్మీ,క్రిష్ణవేణి, రజిత,సరిత తదితరులు పాల్గొన్నారు.