అరుణోదయ రామారావు ఆశయ సాధనం కోసం కృషి చేస్తాం
అరుణోదయ రామారావు ఆశయ సాధనం కోసం కృషి చేస్తాం
- అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నాయకులు బట్టు నాగేశ్వరరావు
కేసముద్రం, ఆంధ్రప్రభ : అరుణోదయ రామారావు అమరత్వ స్ఫూర్తితో, సామాజిక మార్పు కోసం, రామారావు ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నాయకులు బట్టు నాగేశ్వరరావు తెలిపారు. రామారావు 7వ వర్ధంతి సందర్భంగా కేసముద్రం మార్కెటింగ్ యార్డ్ లో అరుణోదయ ఆధ్వర్యంలో కామ్రేడ్ రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బట్టు నాగేశ్వరరావు మాట్లాడుతూ… రాళ్లను కరిగించే రాగం తీసి రాజ్యాన్ని కబళించే గానం చేసి బతకంతా పాటతో పయనం చేసిన వర్గ పోరాటాన్ని మదినిండా తలచి పచ్చని అడివమ్మ గాయాలను, నెత్తురు పోసిన యాగాలను గానం చేసిన రామారావు అన్నకు జోహార్లు తెలియజేశారు.
సందర్భంగా జరిగిన సభకు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉమ్మడి కేసముద్రం సబ్ డివిజన్ నాయకులు బట్ట మేకల రాజు అధ్యక్షతన నాయకులు బొమ్మగాని వెంకన్న మాట్లాడుతూ ప్రజల కష్టాల నుండి పురుడు పోసుకున్న ప్రజా కళలు, శ్రమ దోపిడీ లేని సమాజం కోసం సాధనంగా ఉంటామని ఆయన అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా కళాకారుల గొంతుకలను నొక్కుతూ నిర్బంధిస్తుందని, ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ గారు ఎన్నికల వాగ్దానాలు విస్మరించారని, ఏటా రెండు కోట్ల కొలువులు, బ్లాక్ మనీ వెలికి తీసి జందన్ ఖాతాలో 15 లక్షల రూపాయల జామ, బేటి బచావో బేటి పడావో, ప్రభుత్వ రంగ సంస్థల, రైతు సంక్షేమం అనేక వాగ్దానాలు నీటిమూటలుగా మారాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు కాసు సూరయ్య, శ్రీనివాస్ రెడ్డి, చిట్లా సంజీవ, ఆదినారాయణ, లింగయ్య, కోడి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
