బ్రిడ్జి గుంతలో పడి కానిస్టేబుల్ మృతి

బ్రిడ్జి గుంతలో పడి కానిస్టేబుల్ మృతి
- యాలాల లక్ష్మీనారాయణపూర్ వద్ద ఘటన
- మృతదేహాన్ని వెలిసిన ఎస్ఐ విఠల్ రెడ్డి
- చీఫ్ విఫ్కు సెక్యూరిటీగా విధులు
తాండూరు, ఆంధ్రప్రభ : బైకుతో పాటు ఓ కానిస్టేబుల్ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గుంతలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన యాలాల మండలం లక్ష్మీనారాయపూర్ వద్ద సోమవారం తెల్లవారు సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వి. నర్సింలు(30) పోలీసు శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నప్పటికి చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి సెక్యూరిటీగా పనిచేస్తున్నారు.

ఆదివారం తాండూరులో జరిగిన భద్రేశ్వర జాతర ఉత్సవాల్లో విధులు నిర్వహించారు. తాండూరు నుంచి గ్రామానికి వెళుతుండగా మార్గమద్యలో యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామ సమీపంలో ఉన్న జాతీయ రహదారి బ్రిడ్జి గుంతలో ప్రమాద వశాత్తు బైకుతో పాటు పడిపోయారు. ఎవ్వరు గమనించకపోవడంతో నర్సింలు నీటినే ఊపిరి ఆడక మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న యాలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఎస్ఐ విఠల్ రెడ్డి బ్రిడ్జి గుంతలోని నీటిలోకి దిగి నర్సింలు మృతదేహాన్ని వెలికి తీశారు. నర్సింలు మృతితో రెడ్డిగణాపూర్ గ్రామంలో విషాదం నిండుకుంది. నర్సింలుకు భార్య ఉంది. గత కొన్ని నెలల క్రితమే వీరికి కూతురు పుట్టి మరణించింది. తాజాగా నర్సింలు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నర్సింలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
