నేటితో పదో తరగతి పరీక్షలు పూర్తి..

నేటితో పదో తరగతి పరీక్షలు పూర్తి..
- మూల్యాంకనానికి రంగం సిద్ధం
- 6 నుంచి 15 వరకు జవాబు పత్రాల పరిశీలన
- 699 మంది ఉపాధ్యాయులతో మూల్యాంకనం
- విజయవాడ కేబీఎన్ డిగ్రీ కళాశాలలో కేంద్రం
- 1.75 లక్షల పత్రాల పరిశీలన
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పదో తరగతి వార్షిక పరీక్షలు నేటితో పూర్తికానున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ పూర్తవడంతో, ఇప్పుడు అందరి దృష్టి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పైనే ఉంది. విద్యాశాఖ ఇప్పటికే సమగ్ర ప్రణాళికతో మూల్యాంకన ఏర్పాట్లను పూర్తి చేసి, కట్టుదిట్టమైన విధానాలతో ముందుకు సాగుతోంది.
ఏప్రిల్ 6 నుండి వేల్యూషన్..
ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూల్యాంకనం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడలోని కేబీఎన్ డిగ్రీ కళాశాలను ప్రధాన మూల్యాంకన కేంద్రంగా ఎంపిక చేసి, అవసరమైన మౌలిక వసతులు సమకూర్చారు. మొత్తం 1,75,644 జవాబు పత్రాలను క్రమబద్ధంగా పరిశీలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా 699 మంది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా మూల్యాంకనం కొనసాగనుంది. పని తీరు పారదర్శకంగా, వేగవంతంగా ఉండేలా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేశారు.
జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ క్యాంప్ అధికారిగా వ్యవహరిస్తూ, మొత్తం ప్రక్రియను సమన్వయం చేయనున్నారు. మూల్యాంకన కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతతో పాటు గోప్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షల ముగింపుతో విద్యార్థుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయన్న ఆసక్తి నెలకొనగా, విద్యాశాఖ వేగంగా మూల్యాంకనాన్ని పూర్తి చేసి త్వరలోనే ఫలితాలు ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది.
