పైరవీలకు కాదు.. ప్రతిభకు పట్టం కట్టాలి..
పైరవీలకు కాదు.. ప్రతిభకు పట్టం కట్టాలి..
- క్రీడాకారులను ఇబ్బంది పెట్టొద్దు
- ఖేలో ఇండియా” మిషన్ ఏర్పాటుకు కృషి చేస్తా
- క్రీడాకారులకు వసతులు కల్పించడమే లక్ష్యం
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
- ముగిసిన “ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్
కరీంనగర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి లేకపోవడం బాధాకరమని.. పైరవీలకు కాదు.. ప్రతిభకు పట్టం కట్టే రోజులు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రీడాకారుల కోసం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 1 నుండి 7 వరకు “ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్” పేరిట వారం రోజులపాటు ఆటల పోటీలు నిర్వహించారు.
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో వివిధ క్రీడా పోటీల్లో అర్హత సాధించి, విజేతలుగా నిలిచిన టీంలకు, పార్లమెంటు స్థాయిలో జరిగిన పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులకు, జట్లకు జిల్లా కలెక్టరేట్ సమీపంలోని హోటల్ “త్రిద”లో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిస్థితిని వివరిస్తూ.. హెచ్సీఏలో సెలెక్ట్ కావాలంటే పైరవీలు, డబ్బులు తీసుకొని సెలెక్ట్ చేసే సంసృ్కతిని కొందరు తీసుకొచ్చారని, క్రీడాకారుల ప్రతిభను దెబ్బతీసే దుర్మార్గానికి చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చర్యలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రాబోయే దశాబ్ద కాలానికి గాను ‘ఖేలో ఇండియా మిషన్’ ను ఏర్పాటు చేస్తోందన్నారు.
ఈ మిషన్ ద్వారా క్రీడాకారుల్లోని సమగ్ర ప్రతిభాభివృద్ధికి మార్గం చూపడంతోపాటు కోచ్లు, సహాయక సిబ్బంది వ్యవస్థాగత అభివృద్ధికి క్రుషి చేస్తుందన్నారు. స్పోర్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సమీకరణతోపాటు క్రీడా సంసృ్కతిని పెంపొందించేందుకు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోటీలు, లీగ్స్ పేరిట క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడా శిక్షణ, పోటీల కోసం క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు ప్రారంభించిందన్నారు. ఆరోగ్యవంతమైన జీవన శైలిలో క్రీడలు ఒక భాగమని, క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే కాకుండా, మానసిక సమస్యలను దూరం చెస్తాయన్నారు.

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. క్రీడలు క్రమశిక్షణ, బృందస్ఫూర్తి, చెట్టుగా పనిచేసే తత్వం, నాయకత్వ లక్షణాలు, వ్యూహరచన నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచన అలవాడేలా చేస్తాయన్నారు. ఆధునిక కాలంలో విద్య ఎంత అవసరమో క్రీడలు అంతే అవసరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఈ క్రీడా పోటీలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ముఖ్యంగా యువతకు ఇదొక మంచి వేదికగా నిలిచిందన్నారు. కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు లు పాల్గొన్నారు.
