హైదరాబాద్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని, వారి సహకారంతో డబ్బులు భారీగా సంపాదిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. టీడీఆర్ పేరిట రేవంత్ రెడ్డి భారీ కుంభ కోణానికి తెర లేపబోతున్నారని, వెంటనే దీనిమీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దాసోజు నామినేషన్ దాఖలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్ను గతంలోనే బీఆర్ఎస్ ప్రతిపాదించిందని, 2023లో అప్పుడు బీజేపీ ఆపిందన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్ను వీడకపోతే ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యేవారని అన్నారు. పట్టుబట్టి బీజేపీ ఆపిందని… ఇప్పుడు వారు ఆపినప్పటికీ దాసోజుకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చిందని మాజీ మంత్రి అన్నారు.
అధికారంలోకి వచ్చిన రోజు నుంచే…
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే అవినీతి, అక్రమ పాలనకు తెరతీశారంటూ రేవంత్ పై ఆరోపణలు గుప్పించారు. 1947 నుంచి దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ సీఎం ఇంత స్థాయిలో డబ్బులు సంపాదించడం తెలియదేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ వ్యక్తుల దోపిడీ పెరిగి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. ఇండియా టుడే సదస్సులో రేవంత్ రెడ్డి దివాళాకోరుతనం బయట పెట్టుకున్నారని మండిపడ్డారు.