తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పునఃప్రారంభిస్తాం..
- కాళేశ్వరం కంటే తుమ్మిడిహట్టే మెరుగైన ప్రాజెక్టు
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి (తుమ్మిడిహట్టి) ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్ఐఎస్)లోని మేడిగడ్డ బ్యారేజీతో పాటు ఇతర కీలక నిర్మాణాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన, కాళేశ్వరం బ్యారేజీలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించిన తర్వాతే తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
రూ.1.5 లక్షల కోట్లకు చేరిన కాళేశ్వరం వ్యయం
2022 కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.1.27 లక్షల కోట్లకు పైగా ఖర్చు జరిగిందని, ప్రస్తుతం మొత్తం వ్యయం రూ.1.5 లక్షల కోట్లను దాటే అవకాశం ఉందని ఉత్తమ్ తెలిపారు. ఇంత భారీ ప్రజాధనం ఖర్చు చేసిన ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణపరమైన, నిర్వహణపరమైన సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. మూల ప్రాణహిత–చేవెళ్ల రూపకల్పన ప్రకారం తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు ఏడాదికి సుమారు 3,466 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం దాదాపు 8,450 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోందని వివరించారు.
కాగ్ నివేదికను ఉటంకిస్తూ, కాళేశ్వరం పంపులన్నీ ఒకేసారి పనిచేస్తే తెలంగాణ రాష్ట్ర మొత్తం విద్యుత్ వినియోగానికి సమానంగా విద్యుత్ అవసరమవుతుందని పేర్కొన్నారని తెలిపారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టులో 72 కిలోమీటర్ల మేర గ్రావిటీ ఫ్లో ఉండడంతో యెల్లంపల్లి వద్ద కేవలం 19 మీటర్ల లిఫ్ట్ చాలు అని, దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుందని, సాగు ప్రయోజనాలు మాత్రం యథాతథంగా ఉంటాయని మంత్రి వివరించారు.
త్వరలో తుమ్మిడిహట్టి పర్యటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి త్వరలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలిస్తామని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును విరమించి మేడిగడ్డకు మార్చడం వల్ల తెలంగాణకు భారీ నష్టం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. అసలు ప్రాజెక్టును సుమారు రూ.38 వేల కోట్లతో పూర్తి చేసి 16.5 లక్షల ఎకరాలకు సాగునీరు, ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాలకు తాగునీరు అందించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టు రూపకల్పన మార్చడంతో భారీ వ్యయం, అధిక విద్యుత్ వినియోగం, ప్రస్తుతం కనిపిస్తున్న నిర్మాణ సమస్యలు తలెత్తాయని విమర్శించారు.
ఐదేళ్లలో మేడిగడ్డ బ్యారేజీ నుంచి మొత్తం 165 టీఎంసీల నీటిని ఎత్తిపోశారని, అందులో 63 టీఎంసీల నీటిని వరదల కారణంగా తిరిగి నదిలోకి వదలాల్సి వచ్చిందని తెలిపారు. అదనంగా సుమారు 20 టీఎంసీల నీరు ఆవిరై నష్టపోయిందన్నారు. మేడిగడ్డలోని కన్నెపల్లి పంప్హౌస్ నుంచి ప్రస్తుతం నీటిని ఎత్తిపోసే పరిస్థితి ఎందుకు లేదో, బ్యారేజీల్లో గుర్తించిన నిర్మాణ లోపాలు ఏమిటో సాంకేతిక ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. జాయింట్ సెక్రటరీ (టెక్నికల్) శ్రీనివాస్ కాళేశ్వరం వ్యవస్థలోని సాంకేతిక పరిమితులు, పునరుద్ధరణ అవసరాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. ప్రజెంటేషన్ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాళేశ్వరం సమస్యలను గుర్తించి పునరుద్ధరణకు కార్యాచరణ రూపొందించినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభినందించారు.
