హైదరబాద్ – టీజీఐఐ పరిధిలో లక్షా 75వేల ఎకరాలను తాకట్టు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని, తన వద్ద నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందని ఆరోపించారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు.
తెలంగాణ భవన్ నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోందని, పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారని కవిత అన్నారు. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
స్టాక్ ఎక్సేంజ్లో నష్టం జరిగితే తెలంగాణలో జమా చేసుకున్న భూముల భవితవ్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. గత 16 నెలల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని, తెచ్చిన అప్పులతో ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని, అభివృద్ధికి వెచ్చించలేదని విమర్శించారు.
తులం బంగారం ఇవ్వలేదని, మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయలేదని, ఏమీ చేయలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో చేసిన అప్పులకు కేవలం రూ. 80 వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.