TG | కేసీఆర్ ఐ ఫోన్ – రేవంత్ చైనా ఫోన్: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : ఆంధ్రప్రభ: బీసీ లెక్కలు కులాల వారిగా బయటపెట్టాలని, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని, ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటుందో.. కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందని విమర్శించారు.

మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బూరడి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి , ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు.

.బీసీ కులసంఘాలతో చర్చలు జరపాలి..

తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని, స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశమవ్వడం లేదని నిలదీశారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో సీఎం మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమేనని, బీసీ కుల సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని, మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని కవిత పిలుపునిచ్చారు.

48 శాతం రిజర్వేషన్లు అని చెప్పి 42 శాతానికి తీసుకొచ్చారని, తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని చెప్పారు.

52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారని, కానీ లెక్కపెట్టడం కూడా రాని రేవంత్ రెడ్డి సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందని, బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయమని అన్నారు. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పదోవపట్టించారని ఆరోపించారు. అలాగే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదని, 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని విమర్శలు చేశారు.

పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు..

ఎండిపోయిన పొలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారని, ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని, రైతులను నీళ్లించే తెలివి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇక ఆడపిల్లలకు స్కూటీలు, మహిళలకు 2500 ఏమయ్యాయని, మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారని, తగిన సమయంలో బుద్దిచెబుతారని అన్నారు. అర్హులకు వెంటనే ఇళ్లు ఇవ్వాలని, రేషన్ కార్డులను ఎందుకు జారీ చేయడం లేదని, రుణ మాఫీ ఎక్కడా కూడా సంపూర్ణంగా కాలేదని వ్యాఖ్యనించారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారని, అయినా కూడా మనోధైర్యంతో కార్యకర్తలు చెక్కుచెదరలేదని చెప్పారు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *