హైదరాబాద్ – కళలను ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు..
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నేడు నిర్వహించిన భక్త రామదాసు జయంతి వేడుకలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ,ఈ క్రమంలోనే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టామని.. ఈ వార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు.నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు.

సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు. సీఎం సూచనల మేరకు భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు ఈ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 26 సంగీత గాన బృందాలు తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు 600 మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొన్నారని వివరించారు.
ఈ కార్య్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు పాల్గొన్నారు