Telangana | ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ కాలపరిమితి పెంపు ..
హైదరాబాద్ – ఎస్సీ వర్గీకరణ అంశంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది.
ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసి సిఫార్సు చేసేందుకు జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్గా గత ఏడాది నవంబర్ 11వ తేదీన బాధ్యతలు చేపట్టారు. వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. మొదటిసారి, జనవరి 10వ తేదీన గడువు ముగియడంతో ఈ కమిషన్ కాలపరిమితిని ఫిబ్రవరి 10 వరకు పొడిగించారు. కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
అయితే, ఈ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అభ్యంతరాలను పునఃపరిశీలించాలని సూచిస్తూ కమిషన్ కాలపరిమితిని మార్చి 10వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.