టీమిండియా సంచలన నిర్ణయం..

  • జింబాబ్వే టూర్‌కు సంజూ శాంసన్‌పై వేటు..
  • ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌కు తొలిసారి పిలుపు!

ఆంధ్ర‌ప్ర‌భ : జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టును బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రకటించింది. అయితే ఈ జట్టు ఎంపికలో సెలక్టర్లు తీసుకున్న ఒక నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌పై సెలక్టర్లు వేటు వేశారు.

శాంసన్ స్థానంలో పంజాబ్ కింగ్స్ డైనమిక్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు తొలిసారి సీనియర్ జట్టు నుండి పిలుపు లభించింది.

శాంసన్‌పై వేటుకు కారణం ?

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్, ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అదే సమయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావడంతో శాంసన్ తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు, ఐపీఎల్ 2026 సీజన్‌లో అస్థిరంగా ఆడినప్పటికీ, పంజాబ్ కింగ్స్ తరఫున 168.87 స్ట్రైక్ రేట్‌తో 510 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు వికెట్ కీపర్ బ్యాటర్‌గా సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.

జట్టులోకి కొత్త ముఖాలు.. రింకూ, మయాంక్ రీఎంట్రీ

జింబాబ్వే టూర్‌ కోసం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దేశీవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో రాణించిన హర్ష్ దూబే, యష్ ఠాకూర్, అశోక్ శర్మలకు జట్టులో చోటు దక్కింది. గాయాలు, ఇతర కారణాలతో గతంలో దూరమైన స్టార్ ఫినిషర్ రింకూ సింగ్, పేస్ గన్ మయాంక్ యాదవ్‌లు తిరిగి జట్టులోకి పునరాగమనం చేశారు. తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.

ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు నితీష్ అవుట్.. దూబే ఇన్

జింబాబ్వే పర్యటనతో పాటు ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు సంబంధించి కూడా బీసీసీఐ ఒక అప్‌డేట్ ఇచ్చింది. గాయం కారణంగా యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ నుండి తప్పుకోగా, ఆయన స్థానంలో సీనియర్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను జట్టులోకి ఎంపిక చేశారు.

జింబాబ్వే టూర్‌కు భారత టీ20 జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).