Stock Market | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..!

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ‌ భారీ నష్టాలతో ముగిశాయి. భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ అవగాహన నేపథ్యంలో సోమవారం మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో నిన్నటి లాభాలు ఆవిరయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌ తదితర షేర్లలో అమ్మకాలతో ఒక్కసారిగా మార్కెట్లు కుదేలయ్యాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 82,249.60 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,572.81 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్‌.. అత్యల్పంగా 81,043.69 పాయింట్లకు పడిపోయింది. చివరకు 1,281.68 పాయింట్లు పతనమై.. 81,148.22 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 346.35 పాయింట్లు తగ్గి.. 24,578.35 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 2,507 లాభపడగా, 1,311 షేర్లు పతనమయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఒక శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా సూచీలు ఒకటి నుంచి 1.6 శాతం పెరిగాయి. ఐటీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్‌ గ్యాస్, రియాలిటీ సూచీలు 0.9-2.5 శాతం తగ్గాయి. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అత్యధికంగా నష్టపోయాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, జియో ఫైనాన్షియల్, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా లాభపడ్డాయి.

Leave a Reply