ఆధారం కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక భరోసా..

ములుగు, ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి వరంగల్ : కుటుంబానికి ప్రధాన ఆర్థిక ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.

మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శనివారం తంగేడు మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, రుణాల చెక్కులను అందజేశారు.

నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద కుటుంబానికి ప్రధాన ఆర్థిక ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోయిన ములుగు జిల్లాలోని 1,318 నిరుపేద కుటుంబాలకు మొత్తం రూ.2.39 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే 765 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.72.50 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కుటుంబానికి ఆర్థిక ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచేందుకు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం సహాయక సంఘాల బలోపేతమే లక్ష్యంగా బ్యాంక్ లింకేజీ రుణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రుణాల ద్వారా మహిళా సంఘాలు తమ జీవనోపాధి కార్యకలాపాలను విస్తరించుకొని కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి సూచించారు.