సిరిసిల్ల, ఆంధ్రప్రభ భరోసా సెంటర్ల ద్వారా బాధిత మహిళలకు రక్షణ లభిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ తెలియజేశారు. ఆదివారం సిరిసిల్ల పట్టణం శ్రీనగర్ కాలనిలో బాధిత మహిళలు, బాలికలకు వైద్యం,కౌన్సిలింగ్,అన్ని రకాల సేవలు అందించడంతో పాటు వారికీ పోలీస్ అండగా ఉంటుందనే మనోదైర్యం కల్పించడం కోసం ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ప్రారంభించి సంవత్సరా కాలం అవుతున్న సందర్బంగా వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు,బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే ముందంజలో ఉన్నామని, భరోసా సహాయ కేంద్రాలు సమగ్రమైన సహాయాన్ని అందించడానికి మరియు ఆపదకు లోనైన వారికి పోలీస్ స్టేషన్లకు,ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూత అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయన్నారు.హింస మరియు లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, స్త్రీలు మరల ఇటువంటి వాటి బారిన పడకుండా చూడడమే భరోసా సెంటర్ ముఖ్య లక్ష్యం అన్నారు.
లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు లేదా బాలికలకు సంబందించిన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన సమయం నుండి బాధితులకు అండగా ఉంటూ వారి మానసిక పరిస్థితి గురించి తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ మరియు భరోసా సెంటర్ల గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్న భరోసా సెంటర్ సిబ్బందిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ లు కృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఏ.ఓ పద్మ, డిసిర్బీ ఎస్.ఐ జ్యోతి, ఎస్.ఐ లు అశోక్,పృథ్వీందర్ గౌడ్,భరోసా సెంటర్ కోఆర్డినేటర్ శిల్ప, లీగల్ సపోర్ట్ అధికారి అనంత, సపోర్ట్ అధికారి స్వభావతి, వెన్నెల, రిసెప్షనిస్ట్ మల్లీశ్వరి, ఏఎన్ఎం పవణిత తో పాటు పలువురు పాల్గొన్నారు.