Saudi Tour | సౌదీ అరేబియాలో మోదీ .. గగనతలంలోనే అపూర్వ స్వాగతం

జెడ్డా -భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటనకు నేడు సౌదీ అరేబియా చేరుకున్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఆయనకు అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు దానిని అనుసరిస్తూ ప్రత్యేక గౌరవం అందించాయి.

ప్రధాని విమానానికి ఇరువైపులా ఎస్కార్ట్‌గా వచ్చిన ఎఫ్‌-15 ఫైటర్ జెట్‌లు ఆయనకు స్వాగతం పలికినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇటువంటి గౌరవం చాలా అరుదుగా లభిస్తుంది. ఈ ప్రత్యేక స్వాగతం ఇరు దేశాల మధ్య, ముఖ్యంగా రక్షణ రంగంలో బలపడుతున్న సంబంధాలకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఈ పర్యటనలో ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.
ఇటీవల ప్రధాని మోదీ, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలో తాజా పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్, సౌదీ అరేబియాల మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయి.

Leave a Reply