అక్రమ మూగజీవాల రవాణాపై పోలీసుల ప్రత్యేక నిఘా

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : రాబోవు బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులు జరగకుండా జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వివి.నాయుడుని ను నోడల్ అధికారిగా నియమించినట్లు వెల్లడించారు. పోలీసు, పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ మరియు ఇతర సంబంధిత శాఖలతో కలిసి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటుచేసి జిల్లావ్యాప్తంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్పోస్టులు, ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అనుమానాస్పద వాహనాలను పూర్తిగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా మూగజీవాలను తరలించడం, అనుమతులు లేకుండా రవాణా చేయడం, జంతు హింసకు పాల్పడడం లేదా నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనలు, కోర్టు మార్గదర్శకాలు మరియు జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు. అవసరమైతే వాహనాల స్వాధీనం, అరెస్టులు, క్రిమినల్ కేసులు నమోదు వంటి చర్యలు కూడా అమలు చేస్తామని తెలిపారు.
జిల్లాలో శాంతిభద్రతలు, సామాజిక సామరస్యం దెబ్బతినే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి, అనుమానాస్పద రవాణా లేదా అక్రమ కార్యకలాపాలపై వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు.
