హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశ సరిహద్దుల్లో ఉద్రికత్త నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఈ దందా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సూచించారు. ఈ మేరకు తన ఎక్స్లో పోస్టు పెట్టారు. ఆర్మీ అధికారులమని చెప్పుకుంటూ అమాయక ప్రజలకు సందేశాలు పంపుతూ, విరాళాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
ఎలాంటి వివరాలు ఇవ్వొద్దు!
ఎవరైనా ఆర్మీ అధికారి పేరుతో డొనేషన్ అడిగితే వెంటనే అనుమానించాలని, ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని సజ్జనార్ స్పష్టం చేశారు. ఒకవేళ అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. దేశభక్తిని అడ్డుపెట్టుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఎలాంటి విరాళాలు ఇవ్వాలన్నా అధికారిక ప్రకటనలు చూసి, ధ్రువీకరించుకున్న తర్వాతే స్పందించాలని ఆయన సూచించారు.