వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేత

సైబరాబాద్ ట్రాఫిక్ విభాగానికి సన్‌ప్రీత్ సింగ్ బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ: ఓరుగల్లు పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి ఎన్. శ్వేతను ప్రభుత్వం నియమించింది. ఇంతకాలం వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన సన్‌ప్రీత్ సింగ్ను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. శ్వేత గతంలో సిద్ధిపేట జిల్లా తొలి మహిళా ఎస్పీగా సేవలందించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమెకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన నాలుగో ప్రాంత అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

భాగ్యనగర ఉత్తర మండల శాంతిభద్రతల విభాగంలో సేవలందించిన ఎన్. శ్వేత.. ఇప్పుడు వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె రాకతో నగర పోలీసింగ్‌లో మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయనే ఆశాభావాన్ని పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.